జీహెచ్ ఎంసీ ఎన్నికలు ఈ దఫా రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఎన్నడూ ఈ ఎన్నికల వేళ హైదరాబాద్ ముఖం చూడని బీజేపీ నేతలంతా ప్రచారానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ప్రచారానికి దిగి హీటెక్కించారు. ప్రచారానికి తెరపడింది. డిసెంబర్ 1 అంటే ఈ రోజు పోలింగ్ మొదలైంది. సెలబ్రిటీల్లో చాలా మంది ఇంటి నుంచి బయటికి వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
రూలింగ్ పార్టీ టీఆర్ ఎస్, ఎం ఐ ఎం, బీజేపీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ మొదలైంది. సెలబ్రిటీల్లో ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి శ్రీమతి సురేఖ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఆ తరువాత కింగ్ నాగార్జున, ఆయన భార్య అమల జూబ్లీహిల్స్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.
నటి లక్ష్మీ మంచు ఎఫ్ ఎన్ సీసీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. దర్శకుడు క్రిష్, రైటర్ పరుచూరి గోపాలకృష్ణ జూబ్లీహిల్స్ లో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం ఓటింగ్ సరళ సాగడం లేదని కేవలం 4.2 పర్సెంట్ మాత్రమే పోలింగ్ నమోదు కావడం కలవరానికి గురిచేస్తోంది. కరోనా భయంతో చాలా మంది ఇంటి నుంచి బయటికి రావడానికి జంకుతున్నారు. దీంతో పోలింగ్ సరళి మందకోడిగా సాగుతోంది.