విజయ్ దేవరకొండ – సుకుమార్ కలయికలో ఓ మూవీ ప్రకటన వచ్చి చాల నెలలే అవుతుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం చూస్తే ఇప్పట్లో వీరి కాంబో మూవీ లేనట్లే అని తెలుస్తుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీగా ‘లైగర్’ చిత్రాన్ని విజయ్ దేవరకొండ పూర్తి చేసాడు. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తరువాత విజయ్ దేవరకొండ మరోసారి పూరిజగన్నాథ్ తో ‘జేజీఎమ్’ (జనగణమన) చిత్రాన్ని ఇటీవలే ప్రారంభించారు. దేశ భక్తి ప్రధానంగా సాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ మిలటరీ అధికారిగా కనిపించబోతున్నారు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. ఈ మూవీ తరువాత అయినా విజయ్ దేవరకొండ – సుకుమార్ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంతా అనుకున్నారు.
కానీ అనూహ్యంగా విజయ్ దేవరకొండ శివ నిర్వాణ డైరెక్షన్ లో ఓ సినిమా ను ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. బుధవారం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ని కశ్మీర్ లో ప్రారంభించబోతున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో విజయ్ దేవరకొండ బిజీగా వుండటంతో సుకుమార్ తో సినిమా మరింత ఆలస్యం కాబోతుందని తెలుస్తుంది. సుకుమార్ కూడా ప్రస్తుతం పుష్ప 2 లో బిజీ గా ఉన్నాడు. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో ఓ సినిమా చేయాలనీ చూస్తున్నాడు. ఇలా సుక్కు , విజయ్ వరుస సినిమాలతో బిజీ గా ఉండడంతో..వీరి కాంబో మూవీ ఇప్పట్లో లేనట్లే అని తెలుస్తుంది.