కరోనా వైరస్ హైదరాబాద్లో స్వైర విహారం చేస్తోంది. రోజు రోజుకీ ఇక్కడ భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతుతున్నాయి. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే 26,574 కేసులు నమోదయ్యాయంటే వైరస్ తీవ్రత ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పోలీస్ సిబ్బంది, డాక్టర్లు, నర్సులు కరోనా వైరస్ బారిన పడుతుండటం సామాన్యులను కలవరానికి గురిచేస్తోంది. రోజుకు హైదరాబాద్ జీహెచ్ ఎంసీ పరిథిలో వందల కేసులు నమోదవుతున్నాయి.
తాజాగా వైరస్ బారిన పడిన హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ నేత జి. నరేందర్ యాదవ్ కరోనా వైరస్ కారణంగా మృతిచెందడం షాక్కు గురిచేస్తోంది. కరోనా వైరస్ సోకిన బాధితులకు సహాయం అందించే కార్యక్రమంలో పాల్గొన్న నరేందర్ యాదవ్ ఆ తరువాత తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వెంటనే ఆయనని ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది.
అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నరేందర్ యాదవ్ మృతి చెందారు. ఇటీవల గాంధీభవన్లో జరిగిన కార్యక్రమాల్లో నరేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఆయన ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారో వారికి కూడా డాక్టర్లు టెస్టులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. నరేందర్యాదవ్ మృతి పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.