ఎన్ని జాగ్గరత్తలు తీసుకుంటున్నా చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అవసరం వుంటేనే బయట కాలు పెడుతున్నా మహమ్మారి సోకుతోంది. లాక్డౌన్ సమయం నుంచి ఇంటి పట్టునే వుంటున్న బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ కరోనాకు చిక్కిన విషయం యావత్ దేశాన్ని నివ్వెర పరిచేలా చేసింది. ఇదే తరహాలో జాగ్రత్తలు పాటిస్తున్నా వరుసగా రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు.
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. ఆయనతో పాటు ఆయన భార్య, కుమార్తెకు కూడా కరోనా సోకడం కలకలం రేపుతోంది. కడప జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో వీరికి కోవిడ్ నిర్ధారణ కవాడంతో వీరిని తిరుపతిలోని స్విమ్స్కు తరలించారు. ఈ ముగ్గురికి ప్రత్యేక గదులు కేటాయించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే వుందని డాక్టర్లు వెల్లడించారు.
గతంలో ఇదే మంత్రిపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఢిల్లీలోని మర్కజ్కు వెళ్లి వచ్చిన వారి వల్లే దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందిందని దేశ వ్యాప్తంగా విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కూడా మర్కజ్ వెళ్లి వచ్చారని, ఆ విషయాన్ని దాచారని ప్రతి పక్ష నేతలు విమర్శలు గుప్పించారు. అయినా ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వివరణ ఇవ్వడానికి నిరాకరించిన విషయం తెలిసిందే.