మెగాస్టార్ చిరంజీవి బంతిని జక్కన్న కోర్టులోకి తన్నేశారు. తెలియకుండానే తెలివిగా దర్శకుడు రాజమౌళిని ఓ ఇష్యూలో ఇరికించేశారు. వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 152వ చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో రామ్చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులోని ఓ కీలక పాత్రలో మహేష్ నటిస్తారంటూ ఇటీవల వరుస కథనాలు వినిపించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మహేష్ ఈ చిత్రంలో నటించడానికి భారీగా పారితోషికం అడిగాడని, ఆ కారణంగా చిత్ర యూనిట్ట వెనక్కి తగ్గి ఆ స్థానంలో రామ్చరణే ఫైనల్ చేసుకున్నారంటూ మళ్లీ వార్తలు మొదలయ్యాయి.
అయితే ఈ వార్తలకు తాజాగా చిరు చెక్ పెట్టారు. ఇటీవల ఓ మీడియా సంస్థతో ఇంటరాక్ట్ అయిన చిరు పలు కీలక విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. `ఆచార్య`లో మహేష్ నటిస్తున్నాడని ప్రచారం మొదలైంది. కానీ ఆ పాత్ర కోసం చరణ్ ని అనుకున్నాం. పొరపాటున `ఆచార్య` టైటిల్ని చెప్పేశాను. ఇప్పుడు మహేష్ పేరు ఎలా బయటికి వచ్చిందో తెలియదు. అయితే మహేష్కు నేనంటే అభిమానం, తనంటే నాకు అంతే ఇష్టం. మహేష్తో సినిమాఈంటే అదృష్టంగా భావిస్తాను. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర వుంది. అది అతిథి పాత్ర కాదు. దానికి మించి వుంటుంది. ఆ పాత్రని రామ్చరణ్ చేయాలని సురేఖ కోరిక. కొరటాల కూడా అదే భావించారు.
అయితే `ఆర్ఆర్ఆర్` షూటింగ్ లో బిజీగా వున్న రామ్చరణ్ దర్శకుడు రాజమౌళి అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన తన సినిమా జరుగుతుండగా మా సినిమాకు చరణ్ డేట్స్ని అడ్జస్ట్ చేయగలడా అన్న అనుమానం మా అందరిలోనూ వుంది. ఆయన, దర్శకుడు కొరటాల కలిసి ఓ నిర్ణయానికి వస్తేనే `ఆచార్య`లో చరణ్ నటించే అవకాశం ఏర్పడుతుంది` అని చిరు అసలు విషయం బయటపెట్టాడం ఆసక్తికరంగా మారింది. మరి చిరు బంతిని తెలివిగా జక్కన్న కోర్టులోకి నెట్టేశారు. ఇప్పుడు రాజమౌళి ఏం చెబుతారో చూడాలి.