బెంగళూరు డ్రగ్ కేసు సాండల్ వుడ్లో ప్రకంపణలు సృష్టించింది. డ్రగ్ వివాదంలో ఇద్దరు హీరోయిన్లు ప్రధానంగా అరెస్ట్ కావడం కన్నడ సినీ ప్రపంచంలో సంచలనంగా మారింది. ఈ కేసులో ముందు సెక్సీ నటి రాగిణి దివ్వేది ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అరెస్ట్ చేసి పరప్పణ అగ్రహార జైలుకి జ్యుడీషియల్ కస్టడీ కింద రిమాండ్ కు తరలించారు.
అ తరువాత అదే స్థాయిలో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న నటి సంజన గల్రాని. ఈ నటిని కూడా డ్రగ్స్ వివాదం కారణంగా జ్యుడీషియల్ కస్టడీ కింద పరప్పణ అగ్రహార జైలుకి తరలించారు. దాదాపు రెండు నెలల పాటు కస్టడీలో వున్న తరువాత ఫైనల్గా వీరిద్దరికి బెయిల్ లభించింది. బయటికి వచ్చిన వీరు పలు సందర్భాల్లో ఆ చీకటి రోజుల్ని మర్చి పోలేకపోతున్నామంటూ కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ డ్రగ్స్ కేసుకి టాలీవుడ్ యంగ్ హీరోకి కూడా లింక్ వుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ యంగ్ హీరో మరెవరో కాదు తనీష్. `నచ్చావులే` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తనీష్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా వుంటున్నారు. ఆ మధ్య చేసిన `రంగు` మూవీ కూడా ఆకట్టుకోలేకపోవడంతో సదరు హీరో కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. ఈ నేపథ్యంలో తనీష్కి తాజాగా డ్రగ్స్ కేసుకి సంబంధించి నోటీసులు అందాయని తెలిసింది. దీంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.