ప్రభాస్ నటించిన చిత్రం `సాహో` ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయినా రెట్టించిన ఉత్సాహంతో ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ వరుస పాన్ ఇండియా స్థాయి చిత్రాలని లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రభాస్ లైన్లో పెట్టిన నాలుగు భారీ చిత్రాలు రాధేశ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ ఫిల్మ్, ప్రశాంత్ నీల్ `సలార్` వున్నాయి. ప్రస్తుతం `జిల్` ఫేమ్ రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తున్న `రాధేశ్యామ్` చిత్రీకరణ జరుగుతోంది.
ఫిక్షనల్ పిరియాడిక్ రొమాంటిక్ లవ్స్టోరీగా ఈ మూవీని దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపించనున్నారని తెలిసింది. ఇందులో ఒకటి 1980 కాలంలో సాగే పాత్ర అని మరో పాత్ర ప్రస్తుత కాలానికి సంబంధించినదని తెలిసింది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల యూనిట్ ఒక ఆసక్తికరమైన సన్నివేశాన్ని చిత్రీకరించినట్టు తెలిసింది. ప్రభాస్ పాత్ర భారతదేశపు దివంగత ప్రధాని ఇందిరా గాంధీని కలిసే సన్నివేశం వుందట.
ఈ సన్నివేశాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన ప్రధానమంత్రి కార్యాలయంలో చిత్రీకరించారట. `రాధే శ్యామ్`లో ప్రభాస్ కథానుసారం దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఎందుకు కలుస్తారు? ఇంతకీ ఆ పాత్రలో ఎవరు నటించారు. గ్రాఫిక్స్ సాహంతో ఈ సన్నివేశాన్ని పూర్తి చేశారా? అన్నది తెలియాలంటే `రాధేశ్యామ్` విడుదల వరకు వేచి చూడాల్సిందే.