కరోనా మహమ్మారి తగ్గిందంటూ.. దాని ప్రభావం అంతగా లేదని చాలా మంది ప్రచారం చేస్తున్నారు. కానీ రియాలిటీ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. వైరస్ అంతగా ప్రభావం చూపించడం లేదని, భయపడాల్సిన పని లేదని ప్రచారం జరుగుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా పరీస్థితులు కనిపిస్తున్నాయి. వరుసగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి.
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా బారిన పడుతున్నారు. కొంత మంది కరోనాతో పోరాడి బయటపడుతుంటే కొంత మంది మాత్రం మృత్యు వాత పడుతున్నారు. తాజాగా హీరో వరుణ్ సందేశ్ ఇంట విషాదం అలుముకుంది. వరుణ్ తాత, ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి (80) కన్నుమూశారు. కరోనా సోకడంతో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు.
రేడియో నాటకాలు రాయడం, వాటిల్లో నటించడం, కథలు, నాటికలు, నవలలు, సినిమాలకు సంభాషణలు రాయడం.. అనువాద వ్యాసాల రచన.. ఇలా పలు విభాగాల్లో ప్రతిభని చాటుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని ఆకాశవాణిలో చేరారు. పదవీ విరమణ వరకు అందులోనే వున్నారు.