`బాహుబలి` తరువాత తెలుగు సినిమా స్వరూపమే మారిపోయింది. మార్కెట్ అంచనాలు దాటేసింది. దీనితో పాటే బడ్జెట్ కూడా దాటిపోతోంది. మార్కెట్ విస్తృతం కావడంతో ప్రతి సినిమా భారీగా పాన్ ఇండియా స్థాయిలో వుండేలా స్టార్ హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా యంగ్టైగర్ ఎన్టీఆర్ నటించనున్న భారీ చిత్రం కోసం ఇలాంటి ప్లాన్లే జరుగుతున్నాయి.
ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరపైకి రాబోతున్న ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రకటన బయటికి వచ్చేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్పై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. తాజా వార్తల ప్రకారం ఇందులో బాలీవుడ్ క్రేజీ భామ, అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టి జాన్వికపూర్ నటించే అవకాశం వుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే త్రివిక్రమ్ ఆమెని సంప్రదించారని. తనకి సౌత్ సినిమాల్లో నటించాలని వున్నా ప్రస్తుతం వున్న బిజీ షెడ్యూల్ కారణంగా అది సాధ్యపడటం లేదని, డేట్స్ కుదిరితే కానీ చెప్పలేనని జాన్వి చెప్పినట్టు తెలిసింది.