మళ్లీ డ్రగ్స్ తెరపై కొచ్చింది. బాలీవుడ్తో పాటు సాండల్వుడ్లోనూ డ్రగ్స్ కలకలం సృష్ఠించిన విషయం తెలిసిందే. తాజాగా ముంబై వేదికగా మరోసారి డ్రగ్స్ కలకలం మొదలైంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి తరువాత అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కి గ్రడ్ పెడ్లర్లతో భారీ స్థాయిలో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ నార్కొటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో ఆమెని అరెస్ట్ చేయడంతో బాలీవుడ్లో ప్రకంపణలు సృష్టించింది.
ఈ కేసు వివాదం సమసిపోయింది అనుకుంటున్న నేపథ్యంలో మళ్లీ బాలీవుడ్లో డ్రగ్స్ రాకెట్ బయటపడటం సంచలనంగా మారింది. ముంబైలోని మీరా రోడ్డులో ఓ హోటల్పై నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడ డ్రగ్స్ ముఠా బయటపడటంతో మరో సారి బాలీవుడ్తో పాటు టాలీవుడ్ కూడా ఉలిక్కిపడింది. కారణం తాజాగా జరిగిన సోదాల్లో టాలీవుడ్కు చెందిన ఓ నటి పట్టుబడిందని అక్కడి మీడియా వెల్లడించింది.
టాలీవుడ్కు చెందిన ఆ నటి ఎవరన్నది మాత్రం ఇంత వరకు బయటికి రాలేదు. కానీ అమె నుంచి 400 గ్రాముల మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారట. అంతే కాకుండా సదరు నటికి మత్తు పదార్థాలు సరఫరా చేసిన సాయిద్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సంఘటన నేపథ్యంలో టాలీవుడ్లో అలజడి మొదలైంది. గతంలో అకున్ సబర్వాల్ టాలీవుడ్లో డ్రగ్స్ దందాపై విచారణ మొందలుపెట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.