`పెళ్లిచూపులు` సినిమాతో జాతీయ స్థాయిలో అవార్డుతో పాటు ప్రశంసల్ని సొంతం చేసుకున్నారు యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఆ తరువాత `ఈ నగరానికి ఏమైంది` చిత్రం చేశారు. మూడవ సినిమా వెంకటేష్తో అనుకున్నారు కానీ ఇప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. ఇదిలా వుంటే ఈ యంగ్ డైరెక్టర్ మరో సారి వార్తల్లో నిలిచాడు. గతంలో `జనతా గ్యారేజ్` సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి తరుణ్ భాస్కర్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు.
తాజాగా మరో సారి ఓ స్టార్ హీరో ఫ్యాన్స్ కు టార్గెట్ కావడం ఆసక్తికరంగా మారింది. హీరో మహేష్ బాబు ఫ్యాన్స్ తరుణ్ భాస్కర్ ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల మలయాళ మూవీ `కప్పెల` చిత్రాన్ని చూసిన తరుణ్ భాస్కర్ కమర్షియల్ చిత్రాలపై, హీరోలపై ఓ రేంజ్లో కౌంటర్లు వేశాడు. `హీరో పిచ్చోడిలా గట్టిగా రీసౌండ్ చేసుకరుంటూ అరవడు. అందరి కంటే స్మార్ట్గా ప్రతి డైలాగ్లో సామెత చెప్పడు. ఎక్సట్రీమ్ స్లోమోషన్లో ఫిజిక్స్ ఫెయిలయ్యేలా ఫైట్లు వుండవు. ప్రతీ రెండు నిమిషాలకు హీరో ఎంట్రీ వుండదు. చివరి పది నిమిషాల్లో రాండమ్గా రైతుల గురించో, సైనికుల గురించో, దేశం గురించో మెసేజ్ వుండదు. మరి దీన్ని కూడా సినిమా అంటారు మరి ఆ ఊర్లో` అని తరుణ్భాస్కర్ తన అభిప్రాయం చెప్పారు.
అయితే తరుణ్ భాస్కర్ విమర్శించిన వాటిల్లో మహేష్ నటించిన మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాల కాన్సెప్ట్లు వుండటంతో మహేష్ ఫ్యాన్స్ తరుణ్ భాస్కర్పై విమర్శల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. దీంతో తరుణ్ భాస్కర్ కూడా మహేష్ ఫ్యాన్స్కి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫేక్ అకౌంట్లతో ట్రోల్ చేసే వారిని పట్టించుకోనని ఘలకివ్వడం ఆసక్తికరంగా మారింది.