మూడున్నరేళ్ల క్రితం సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం `పెళ్లిచూపులు`. తరుణ్భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా రిలీజ్కి ముందు ప్రత్యేకంగా ప్రివ్యూ షోలని ఏర్పాటు చేశారు. దాదాపు 20 షోలు వేసుంటారు. ఆ తరువాతే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మళ్లీ అదే ఫార్ములాను యంగ్ హీరో రాజ్ తరుణ్ కోసం పాటిస్తున్నారు నిర్మాత దిల్ రాజు. జి.ఆర్. కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మించిన చిత్రం `ఇద్దరిలోకం ఒకటే`.
రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి టర్కిష్ ఫిల్మ్ స్ఫూర్తి అని ఆ మధ్య హీరో రాజ్ తరుణ్ మీడియాతో ఇంటరాక్ట్ అయిన సందర్భంలో వెల్లడించారు. `అర్జున్రెడ్డి` ఫేమ్ షాలిని పాండే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా మీడియాకు చూపిస్తున్నారని తెలిసింది. రిలీజ్కు ముందే రివ్యూలు రాయించి సినిమాపై హైప్ ని క్రియేట్ చేయాలన్న ఆలోచనలో భాగంగా ఈ షోలని ఏర్పాటు చేస్తున్నట్టు ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తోంది.
పబ్లిసిటీ లేకపోవడంతో ప్రివ్యూ షోల ద్వారా క్రేజ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సినిమాలోనూ దమ్ముందని, ఫొటోగ్రఫి, హృదయాల్ని కదిలించే కథనం, కంట తడి పెట్టించే క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలని, షాలిని పాండే తనదైన మార్కు నటనతో సినిమాకు ప్రధాన హైలైట్గా నిలవనుందని ప్రివ్యూ చూసిన వాళ్లు చెబుతున్నారు. దీంతో దిల్ రాజు పెళ్లిచూపులు ఫార్ములా వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోందని ప్రచారం మొదలైంది.