శృతీహాసన్.. కమల్ హాసన్ గారాల పట్టిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా అంతకు ముందే తనేంటో నిరూపించుకుంది. గాయనిగా, సంగీత దర్శకురాలిగా చిన్న వయసులోనే తన ప్రత్యేకతను చాటుకుని ఆశ్చర్యపరిచింది. కమల్ నటించిన క్షత్రియ పుత్రుడు, హేరామ్`, భామనే సత్యభామనే, సూర్య నటించిన `సూర్య సన్నాఫ్ కృష్ణన్` చిత్రాలకు పాటలు పాడిన శృతిహాసన్ కమల్ నటించిన `ఈనాడు` (ఉన్నైపోల్ ఒరువన్) తో సంగీత దర్శకురాలిగా పరిచయం అయ్యింది.
ఆ తరువాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా శృతి సంగీతాన్ని మాత్రం వీడలేదు. తాజాగా శృతిహాసన్ పాడిన పాట యూట్యూబ్లో అదరగొట్టేస్తోంది. పాప్ సాంగ్స్ అంటే హాలీవుడ్ పాప్ సాంగ్స్ కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో శృతి పాడిన ఇంగ్లీష్ సాంగ్ హల్ చల్ చేస్తోంది. లాక్డౌన్ సమయంలో సెలబ్రిటీలంతా తమకు నచ్చిన పని చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా శృతి స్వయంగా ఓ పాట రాసి దానికి స్వరాలు సమకూర్చి తానే పాడటం విశేషంగా చెబుతున్నారు.
`ఎడ్జ్` పేరుతో శృతి ఈ పాటని తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్లో హల్ చల్ చేస్తోంది. శృతిహాసన్ నటిస్తున్న తాజా చిత్రం `క్రాక్`. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రం కరోనా కారణంగా చివరి దశలో ఆగిపోయింది.