గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం పూర్తయ్యాయి. సీనీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల అశ్రు నయనాల మధ్య తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు పూర్తయ్యాయి. బాలు భార్య సావిత్రమ్మ, తనయుడు ఎస్పీచరణ్, కుమార్తె పల్లవి, సోదరి శైలజ సహా కుటుంబ సభ్యులు చివరి సారిగా చేయాల్సిన క్రతువులు నిర్వహించారు.
కోవిడ్ నేపథ్యంలో నిన్న రాత్రే బాలు పార్ధీవదేహాన్ని చెన్నై శివారు లోని తామరైపాక్కంలో వున్న బాలు వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. శనివారం ఉదయం అక్కడే అంతమ సంస్కరాలు నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం తరుపున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు.
మధుర గాయకుడిని చివరి సారిగా చూసేందుకు ప్రముఖులు, అభిమానులు భారీ స్థాయిలో తామరైపాక్కం లోని బాలు వ్యవసాయ క్షేత్రానికి తరలి వచ్చారు. అయితే కోవిడ్ నిబంధనల మేరకు పరిమిత సంక్ష్యలోనే అభిమానుల్ని. ప్రముఖుల్ని పోలీసులు అనుమతించారు. సినీ ప్రముఖులు భారతీరాజా, దేవిశ్రీప్రసాద్, మనో తదితరులు బాలు భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులర్పించారు.