కరోనా కారణంగా అంతా ఓటీటీల మీద పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది తమ చిత్రాలని ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి కొంత మంది క్రేజీ డైరెక్టర్లు ప్రముఖ ఓటీటీల కోసం వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వేణు ఊడుగుల చలం `మైదానం`ని వెబ్ సిరీస్గా తీసుకురానున్నట్టు ప్రకటించారు. ఇదే దారిలో మరి కొంత మంది క్రేజీ దర్శకులు వెబ్ సిరీస్లని ప్లాన్ చేస్తున్నారు.
దీనికి తోడు ఇటీవల వచ్చిన `ఫ్యామిలీమెన్`, పాతాళ్లోక్, మిర్జాపూర్, సాక్రెడ్ గేమ్స్ వంటి వెబ్ సిరీస్లు ఆకట్టుకోవడం.. మారుతున్న టెక్నాలజీకి, కాలానికి తగ్గట్టుగా మేకర్స్ కూడా మారుతుండటంతో తెలుగులోనూ వెబ్ సిరీస్ల హంగామా మొదలవుతోంది. అయితే చాలా మంది మాత్రం హిందీ దర్శకులు స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారు. అయితే పక్కా ప్లాన్ తో పాన్ ఇండియా స్థాయిలో ఓ వెబ్సిరీస్ని ప్రముఖ నిర్మాణ సంస్థ తెరపైకి తీసుకురాబోతోందని తెలిసింది.
ఆ సంస్థే సితార ఎంటర్టైన్మెంట్స్ .. హారిక హాసిని క్రియేషన్స్కి అనుబంధ సంస్థ అయిన ఈ నిర్మాణ సంస్థ త్వరలో ఓ వెబ్ సిరీస్ని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారట. నెట్ఫ్లిక్స్ని సంప్రదించిన తరువాతే ఈ వెబ్ సిరీస్ని పట్టాలెక్కించబోతున్నారని ఇన్ సైడ్ టాక్.