టాలీవుడ్ ప్రేక్షకులకు `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, బొమ్మరిల్లు చిత్రాలతో చేరువయ్యారు హీరో సిద్ధార్ధ్. `జబర్దస్త్` తరువాత గత కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా వుంటూ వస్తున్నారు. అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న `మహా సముద్రం` చిత్రంతో మళ్లీ ఇన్నేళ్ల విరామం తరువాత టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ వైజాగ్లో జరుగుతోంది. ఇదిలా వుంటే సిద్ధార్ధ్ని హత్య చేస్తామని, ఆయన కుటుంబ సభ్యులపై అత్యాచారం చేస్తామంటూ కొంత మంది బెదిరింపు కాల్స్ చేస్తున్నారట. ఈ విషయాన్ని హీరో సిద్ధార్ధ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమిళనాడుకు చెందిన భాజపా వర్గాలే తన ఫోన్ నంబర్ని లీక్ చేశారని, తద్వారా వారి కార్యకర్తలతో తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు.
`తమిళనాడు భాజపాకు చెందిన కొంత మంది నా ఫోన్ నంబర్ని లీక్ చేశారు. సుమారు 500 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫోన్ చేసిన అందరూ నన్ను బెదిరిస్తూ తిడుతున్నారు. నా కుటుంబ సభ్యులను అత్యాచరం చేసి హత్య చేస్తామంటూ గడిచిన 24 గంటల నుంచి బెదిరిస్తున్నారు. తనకు ఫోన్ చేసి బెదిరించిన వారి ఫోన్ నంబర్లు, వారి కాల్ డేటా రికార్డ్ చేసి భద్రపరిచాను. వాటిని పోలీసులకు అందజేస్తాను` అని సిద్దార్ధ్ ట్వీట్టర్లో వెల్లడించారు.