బాలీవుడ్ హిట్ చిత్రం `టు స్టేట్స్` ఆధారంగా తెలుగులో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నాలు జరిగాయి. అడివి శేష్ ని హీరోగా అనుకున్నారు. యాంగ్రీ యంగ్మెన్ డా. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ని ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం చేయాలనుకున్నారు. 2018లో లాంఛనంగా ఓపెనింగ్ కూడా జరిగింది. మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ ఆ సినిమాని మధ్యలోనే ఆపేశారు.
ఇదిలా వుంటే శివానిని హీరోయిన్గా పరిచయం చేస్తూ మల్లిక్ రామ్ ఓ రొమాంటిక్ లవ్స్టోరీని తెరకెక్కిస్తున్నారు. `ఓ బేబీ` చిత్రంలో హీరోయిన్ సమంతకు మనవడిగా నటించిన తేజ సజ్జ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఎస్ ఓరిజినల్స్, మహాతేజ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో శివాని వెన్నెలగా నటిస్తోంది. నేడు ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం శివాని ఫస్ట్ లుక్ని బుధవారం రిలీజ్ చేసింది.
ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. సైలెంట్గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. త్వరలోనే చిత్ర బృందం మరిన్ని వివరాల్ని వెల్లడించనున్నట్టు తెలిసింది.