టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ నిర్మాత తనను మోసం చేశాడని పేర్కొంటూ తీవ్ర ఆందోళన చేసింది సునీత. మంగళవారం అర్థరాత్రి హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద జూనియర్ ఆర్టిస్ట్ సునీత హంగామా చేసింది. తనకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ ఆందోళనకు దిగింది. దీంతో ఫిలిం ఛాంబర్ వద్ద వాతావరణం మరోసారి వేడెక్కింది.
తనను తాను గొలుసులతో బంధించుకుని ఫిలిం చాంబర్లో మంగళవారం రాత్రంతా నిరసన తెలిపింది సునీత. సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పిన నిర్మాత బన్నీ వాసు తనను నమ్మించి మోసం చేశాడని సునీత ఆరోపణలు చేసింది. ఇది అడిగితే తనపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని నానా రచ్చ చేసింది.
తనను మోసం చేసిన ఆ నిర్మాత స్వయంగా వచ్చి సమాధానం చెబితేనే తాను బయటకు వస్తానంటూ ఆమె నానా యాగీ చేయడంతో.. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉదయం 6 గంటల సమయంలో ఫిలిం చాంబర్ చేరుకున్న పోలీసులు బలవంతంగా సునీతను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు.
తనకు జరిగిన అన్యాయం గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలియాలనే ఇలా నిరసనకు దిగానని చెప్పింది సునీత. దీనిపై అల్లు అరవింద్ కూడా వచ్చి వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. అయితే తన పోరాటంతో జనసేనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది సునీత.
జూనియర్ ఆర్టిస్ట్ సునీత గతంలో కత్తి మహేష్పై కూడా ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పలు మీడియా సమావేశాల్లో పాల్గొని కత్తి మహేష్పై ఓ రేంజ్ లో విరుచుకుపడిన ఆమె.. మళ్ళీ ఇలా ఓ నిర్మాతపై ఆరోపణలు గుప్పించడం అనుమానాలకు తావిస్తోంది…!!