అనుకున్నట్టుగానే సర్కారు వారి పాట టీమ్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. సరిగ్గా 9 గంటల 9 నిమిషాలకు ఈ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. మహేష్ కు 9 సెంటిమెంట్ కాబట్టి అదే ఫాలో అయ్యారు.
అయితే ఈ మోషన్ పోస్టర్ లో మహేష్ పూర్తి లుక్ ను రిలీజ్ చేస్తారు అనుకున్న వాళ్లకు నిరాశే ఎదురైంది. కేవలం గ్రాఫిక్స్ లో మహేష్ చేయి రూపాయి బిళ్ళను ఎగరేయడం చూపించారు. అయితే లాక్ డౌన్ కారణంగా మహేష్ తో షూట్ చేసే అవకాశం దొరకలేదు. ఏదేమైనా ఈ విషయం పక్కపెడితే మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. ముఖ్యంగా థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ అనదగ్గ రీతిలో ఉంది.
పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. గీత గోవిందం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న పరశురామ్ ఇప్పుడు మహేష్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. మధి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసిన సంగతి తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.