కరోనా వైరస్ భయం ఏమో గానీ టాలీవుడ్లో మాత్రం పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది. ఒకప్పుడు పెళ్లంటే నో కామెంట్స్ అంటూ దాటేసిన వారంతా ఇప్పుడు కరొనా ప్రభావంతో వరుసగా పెళ్లికి సిద్ధమవుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. క్రేజీ నిర్మాత దిల్ రాజు రెండవ పెళ్లి నుంచి టాలీవుడ్ లో వివాహాల హంగామా మొదలైంది. దిల్ రాజు తరువాత హీరో నిఖిల్, దర్శకుడు సుజీత్, హీరోలు నితిన్, రానా వివాహం చేసుకుని బ్యాచిలర్ లైఫ్కు గుడ్ బై చెప్పేశారు.
తాజాగా ఈ జాబితాలోకి మెగా మేనల్లుడు హీరో సాయి ధరమ్తేజ్ ఎంటరవుతున్నట్టు ఓ వీడియోని వదిలాడు. `ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి….` అని సాయిధరమ్తేజ్ షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. వీడియోలో సింగిల్ ఆర్మీ అనే వాట్సాప్ గ్రూప్ వుంది. అందులో వున్న నిఖిల్, నితిన్, రానా లెఫ్ట్ కావడం, చివరలో సాయిధరమ్తేజ్ కూడా గ్రూప్ నుంచి టెఫ్ట్ అవుతూ సారి ప్రభాస్ అన్నా అంటూ లెఫ్ట్ కావడం ఫన్నీగా వుంది. సింగిల్ ఆర్మీ అనే వాట్సాప్ గ్రూప్ కి డీపీగా ఆర్. నారాయణమూర్తి ఫొటో వుండటంతో సాయి ధరమ్తేజ్ తన సినిమా కోసం ఆడుతున్న పబ్లిసిటీ జిమ్మిక్కుగా తెలిసిపోతోంది. ఈ వీడియోని ట్వీట్ చేసిన సాయి ధరమ్తేజ్ సోమవారం ఉదయం 10 గంటలకు మరిన్ని వివరాల్ని తెలియజేస్తానని ప్రకటించడం ఆసక్తిగా మారింది.
అయితే ఊహించినట్టే సాయిధరమ్తేజ్ తను నటిస్తున్న తాజా చిత్రం `సోలో బ్రతుకే సోబెటర్` కొత్త పోస్టర్ని రిలీజ్ చేశాడు. దీని కోసమే ఇంతగా పబ్లిసిటీ జిమ్మిక్కు చేసి అందరినీ పెళ్లి ఆలోచనల్లో పడేసి తన సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీని రాబట్టుకునే ప్రయత్నం చేయడం విశేషం. ఈ చిత్రానికి సుబ్బు దర్శకత్వం వహిస్తున్నారు. భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్ర థీమ్ సింగిల్ ఆర్మీ. దీని పబ్లిసిటీ కోసం సాయిధరమ్తేజ్ కొత్త పంథాను అనుసరించడం ఆక్టుకుంటోంది. ఈ విషయం తెలియని వాళ్లంతా సాయిధరమ్ తేజ్ పెళ్లికి రెడీ అవుతున్నాడంటూ పొరపాటు పడ్డారు. ఈ నెల 26న ఈ చిత్రానికి సంబంధించిన `హే నేనేనా.. ` అంటూ సాగే సెకండ్ ఇంగిల్ని రిలీజ్ చేస్తున్నారు.