దర్శకధీరుడు రాజమౌళి బుధవారం రాత్రి తనకు, తన కుటుంబ సభ్యులకు మైల్డ్ సింప్టమ్స్ వున్నాయని, పరీక్షిస్తే కరోనా పాజిటివ్ అని తేలిందని, ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్లో వుంటున్నామని, త్వరగా కోలుకున్న తరువాత ప్లాస్మాని దానం చేస్తానని రాజమౌళి ట్విట్టర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. జక్కన్న కుటుంబం కరోనా బారిన పడటంతో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులంతా జక్కన్న త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.
ఇటీవల నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మాత్రం కోడిగుడ్లు తినండి సార్ అంటూ రాజమౌళికి చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కరోనా బారిన పడి బండ్ల గణేష్ కోలుకున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్వర్మ కూడా రాజమౌళి, ఆయన కుటుంబం త్వరగా కోలుకుంటారని ట్వీట్ చేశారు. అయితే తనదైన చమత్కారాన్ని జోడించి ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
`సర్ మీ సైనికుడు బాహుబలిని పిలవండి. కరోనాను ఓ తన్ను తన్నమనండి.. ఇక జోక్లని పక్కన పెడితే మీరు, మీ కుటుంబ సభ్యులు అతి త్వరలోనే కరోనా నుంచి త్వరగా కోలుకుంటారు` అని వర్మ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సొంత ఓటీటీ కోసం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.