![రాజమౌళికి అండగా నిలిచిన ఇండస్ట్రీ! రాజమౌళికి అండగా నిలిచిన ఇండస్ట్రీ!](https://telugu.tollywood.net/wp-content/uploads/2020/07/Rajamouli-tested-Positive-for-Coronavirus.jpg)
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. ఇటీవల బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ అంతా కరోనా బారిన పడడం యావత్ భారతాన్ని షాక్కు గురిచేసింది. ఈ ఫ్యామిలీ కోలుకుంటున్న నేపథ్యంలో టాలీవుడ్లో పిడుగులాంటి వార్త. `బాహుబలి` చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుని తెలుగు సినిమాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన దర్శకుడు రాజమౌళికి, ఆయన కుటుంబానికి బుధవారం కరోనా బారిన పడటం పలువురిని షాక్ కు గురిచేసింది.
ఎలాంటి లక్షణాలు లేకున్నా తనకి, తనకుటుంబానికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని, ప్రస్తుతం తామంతా హోమ్ క్వారెంటైన్లో వున్నామని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, త్వరగా కోలుకుని ప్లాస్మా దానం చేస్తానని ట్విట్టర్ వేదికగా రాజమౌళి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీ వర్గాలు, స్టార్ హీరోలు, దర్శకులు, నటీనటులు రాజమౌళి కుటుంబానికి అండగా నిలిచారు. త్వరగా కోలుకోండని ధైర్యం చెప్పడం మొదలుపెట్టారు.
జాగ్రత్త సర్, మీరు, మీ ఫ్యామిలీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని హీరో మహేష్ తో పాటు పలువురు సెలబ్రిటీలు ట్వీట్ల రూపంలో జక్కన్న ఫ్యామిలీకి అండగా నిలిచారు. ట్వీట్లు పెట్టిన వాళ్లలో మహేష్తో పాటు గుణశేఖర్, దేవా కట్టా, జగపతిబాబు, శ్రీను వైట్ల, దేవిపశ్రీప్రసాద్, సంపత్నంది, సాయిధరమ్తేజ్, వైజయంతీమూవీస్, సురేష్ ప్రొడక్షన్స్, రాశిఖన్నా, పాయల్ ఘోష్, వేదిక, సుశాంత్, రాహుల్ దేవ్ తదితరులు వున్నారు.