ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో వణికిపోతూ ఇంటి నుంచి బయటికి రావడానికి భయపడిస్తుంటే వర్మ మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తూ వరుస చిత్రాల్ని ఓటీటీల ద్వారా వదులుతున్నారు. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లు ఆగిపోయినా, థియేటర్స్ బంద్ చేసినా వర్మ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. బడా బడా మేకర్స్కే షాకిచ్చే తరహాలో వరుసగా సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు.
మియా మాల్కోవాతో క్లైమాక్స్, శ్రీ రాపాకతో `నేక్డ్` (నగ్నం), కరోనా వైరస్ వంటి చిత్రాల్ని వరుసగా రిలీజ్ చేసిన వర్మ ; ప్రస్తుతం వివాదాస్పద కథాంశంతో `పవర్స్టార్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నవిషయం తెలిసిందే. పవర్స్టార్ పవన్ కల్యాణ్ని టార్గెట్ చేస్తూ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్తో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన వర్మ ట్రైలర్ని చూడాలంటే 25 రూపాయలు కట్టాల్సిందే అంటున్నారు. తన ట్రైలర్ తరహాలోనే రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` ట్రైలర్ని కూడా డబ్బులు పెట్టి చూడాల్సిందే అంటున్నారు.
ఈ సందర్భంగా రాజమౌళిని ఉద్దేశిస్తూ `హే రాజమౌళి.. ప్రస్తుతం ప్రపంచం అంతా ఆన్లైన్కు మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఇదే సరైన మార్కెట్. ఇప్పడంతా సరికొత్తగా ఆలోచించడం రావాలి. మేమంతా `ఆర్ ఆర్ ఆర్` ట్రైలర్కు డబ్బులు చెల్లించి చూసే సమయం కోసం ఎదురుచూస్తున్నాం` అని ట్వీట్ చేశారు వర్మ. దీనికి రాజమౌళి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. గతంలో ఓ వివాదంపై స్పందించాలని రాజమౌళిని వర్మ కోరితే `నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారూ` అని వర్మకు రాజమౌళి గట్టి కౌంటరే ఇచ్చారు.