కరోనా ఎఫెక్ట్ కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ భారీ స్థాయిలోనే నష్టాలని ఎదుర్కుంటోంది. లాక్డౌన్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సర్వం బంద్ చేయబడ్డాయి. దీంతో సినిమా థియేటర్లు కూడా బంద్ కావడం తెలిసిందే. అయితే మార్చిలో రిలీజ్ చేయాలనుకున్న సినిమాలన్నీ కరోనా రక్కసి కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది.
ప్రదీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, నాని, సుధీర్బాబు కలిసి నటించిన మల్టీస్టార్ చిత్రం `వి`..ఇలా చెప్పుకుంటూ పోతే చిన్నా చితకా చాలా చిత్రాలే వాయిదా పడ్డాయి. ఈ నెల 14తో లాక్ డౌన్ ఎత్తేయాలి. కానీ కరోనా ప్రభావం ఇంకా వుండటంతో లాక్ డౌన్ని పొడిగించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి.
అయితే లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత ఏం చేయాలి? .. ఎప్పటి నుంచి సినిమాల షూటింగ్లు మొదలుపెట్టాలి?. సినిమాల ఏ టైమ్లో రిలీజ్ చేయాలి? .. థియేటర్ల పరిస్థితి ఏంటి? ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయాలి? అనే అనుమానం నిర్మాతల్లో మొదలైందట. దీంతో అత్యవసరంగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశం కాబోతున్నారని, లాక్ డౌన్ తరువాత తీసుకోబోయే నిర్ణయాలపై చర్చించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశం టెలి కాన్ఫరెన్స్ ద్వారా జరగబోతున్నట్టు తెలిసింది.