కరోనా బాధితుల సహాయార్థం సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్లంతా స్పందిస్తున్నారు. హీరోలు, నిర్మాతలు, దర్శకులు, ఓ హీరోయిన్ తమ వంతు బాధ్యతగా విరాళాలు ప్రకటించారు. ఇప్పటికీ ప్రకటిస్తూనే వున్నారు. తాజాగా మరో నిర్మాత విరాళం అందించారు. చుట్టాలబ్బాయి, దండుపాల్యం 3, నేల టిక్కెట్టు, డిస్కోరాజా వంటి విభిన్నమైన చిత్రాల్ని నిర్మించిన ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ అధినేత, పారిశ్రామిక వేత్త రామ్ తాళ్లూరి 5 లక్షల 50 వేలు విరాళం ప్రకటించారు.
ఈ మొత్తంలో 5 లక్షలు తెలంగాణ ముఖ్య మంత్రి సహాయనిధికి అందించిన రామ్ తాళ్లూరి యాభై వేల రూపాయల విలువచేసే నిత్యావసర సరుకుల్ని సినీ కార్మికుల కోసం అందజేసి తన గొప్ప మనసుని చాటుకున్నారు. తాను అధినేతగా వ్యవహరిస్తున్న లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్కై జోన్ ఇండియా సంస్థల తరుపున ఈ విరాళం అందిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. గత నెలలో తన కంపెనీ పనిమీద అమెరికా వెళ్లిన రామ్ తాళ్లూరి లాక్ డౌన్ నేపథ్యంలో అక్కడే ఆగిపోయారు.
ఇదిలా వుంటే తమిళ హీరో అజిత్ కోటి 25 లక్షలు విరాళం అందించారు. పీఎం సహాయ నిధికి 50 లక్షలు, తమిళనాడు ప్రభుత్వానికి 50 లక్షలు, కార్మిక సమాక్షకు 25 లక్షలు విరాళం అందించారు.