మాఫియా నేపథ్యంలో ప్రభాస్ మరో సినిమా చేస్తున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ చిత్రం చేస్తున్న ప్రభాస్ ఈ మూవీ తరువాత తన 21వ చిత్రాన్ని ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ రూపొందించనున్న పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని చేస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించినట్టు తెలిసింది. ‘కేజిఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నారని, ఇప్పటికే ఇద్దరి మధ్య డీల్ ఫినిష్ అయినట్టు ఓ కన్నడ డైలీ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది.
ఇది ప్రభాస్ 22వ సినిమా అని, మాఫియా నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని సదరు కన్నడ పత్రిక వెల్లడించింది. దీనికి సంభందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ ‘కేజిఎఫ్ 2 ‘ చిత్రం తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని చేయబోతున్నారు. ఇటీవలే స్టోరీ లైన్ వినిపించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.
- Advertisement -