రెబెల్ స్టార్ ప్రభాస్ నటించనున్న 21వ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంకా సినిమా మొదలైందే లేదు కానీ ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకొక వార్త హల్చల్ చేస్తోంది. ఇటీవలే ప్రభాస్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోన్ నటించనుందని అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ వార్తపై ప్రభాస్ అభిమానులే కాక బాలీవుడ్ వర్గాలు కూడా సంతోషం వ్యక్తం చేసాయి. ప్రభాస్ కు తగ్గ హీరోయిన్ దొరికిందని అందరూ అనుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరన్న దానిపై చర్చ నడుస్తోంది.
నిజానికి ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటివరకూ రెండు సినిమాలే చేసాడు. ఈ రెండు సినిమాలకు యువ సంగీత దర్శకులే పనిచేసారు. మహానటి చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు. ప్రభాస్ సినిమాకు మిక్కీ న్యాయం చేయగలడా అని నాగ్ అశ్విన్ సందేహంలో ఉన్నాడు. ఎందుకంటే ప్రభాస్ 21వ చిత్రం కూడా ప్యాన్ ఇండియా లెవెల్లోనే తెరకెక్కుతోంది. అందుకోసమే సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే బెస్ట్ అని దర్శకుడు ఫీలవుతున్నాడు.
అందుకే ఏ ఆర్ రెహ్మాన్ లేదా ఎం ఎం కీరవాణిలలో ఒకర్ని ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంచుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసిన అనుభవముంది. మరి వీరిలో ఎవరు సంగీత దర్శకుడిగా ఎంపికవుతారు అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.