రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20వ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను రాధా కృష్ణ తెరకెక్కిస్తుండగా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు అన్నీ వాయిదా పడ్డాయి. మరో రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలయ్యే అవకాశముంది. ఈ సినిమాకంటే అభిమానులు ప్రభాస్ తర్వాత చేయబోయే సినిమా గురించి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమాను తెరకెక్కించేది మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్.
రెండు సినిమాలతోనే తన ప్రతిభను చాటుకున్నాడు నాగ్ అశ్విన్. ఈ సినిమా షూటింగ్ అసలైతే ఈ నెలాఖరున మొదలవ్వాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ప్రభాస్ ప్రస్తుత సినిమా లేట్ అవ్వడంతో ఈ సినిమా కూడా ఆలస్యమైంది. ఇక ఈ సినిమా గురించి మొదటినుండి ప్రచారంలో ఉన్నది ఇది ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా అని, ప్రభాస్ ఇందులో సామాన్య మానవునికి, దేవకన్యకు పుట్టే మహిమలున్న వ్యక్తిగా కనిపిస్తాడని అంటూ వచ్చారు.
కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కాదని ఫిక్షనల్ డ్రామా అని తెలుస్తోంది. పూర్తిగా మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, ఇందుకోసం ఒక భారీ సెట్ ను కొన్ని నెలల్లో హైదరాబాద్ లో నిర్మిస్తారని అంటున్నారు. ఏకంగా 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తారని తెలుస్తోంది.
మరి ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశముంది.