పవర్స్టార్ పవన్కల్యాణ్ వెండితెరపై మెరిసి దాదాపు మూడేళ్లవుతోంది. ఆయన రీఎంట్రీ ఎప్పుడా అని వేయికళ్లతో ఎదురుచూసిన అభిమానులకు `వకీల్సాబ్` సినిమాతో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్` ఆధారంగా రూపొందిన చిత్రమిది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ మూవీ వరల్డ్ వైడ్గా ఈ నెల 9న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి ప్రీ రిలీజ్ వేడుకని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవర్స్టార్ సమకాలీన రాజకీయాలపై, రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ `పేకాట క్లబ్బులు నడిపేవాళ్లు ఎమ్మెల్యేలు కావొచ్చు. పైరవీలు చేసేవాళ్లు రాజకీయాల్లో వుండొచ్చు. మీరు పాల డైరీలు పెట్టొచ్చు నేను సినిమాలు చేస్తూ రాజకీయం చేయకూడదా? అవినీతి చేయకుండా ఉండటం కోసమే నేను సినిమాలు చేస్తాను. దాని వల్ల వందల మందికి ఉపాది కూడా దొరుకుతోంది. నేను సినిమా చేస్తే వోయ్యి మంది బతుకుతారు. సినిమా అనేది డబ్బు కోసమే కాదు. పది మంది ఉపాధి కోసం. అందరి ఆనందంతో పాటు నాకు డబ్బు వస్తే సంతోషమే. ఆ డబ్బుని సమాజం కోసమే వినియోగిస్తా. భగవంతుడు అవకాశం ఇచ్చినంతవరకు ప్రజలకు సేవ చేస్తా. అందులో భాగంగా సినిమాలు కుదిరితే కచ్చితంగా చేస్తా. సినిమాల నుంచి పారిపోయే వ్యక్తిని కాదు.
మూడేళ్లు సినిమా చేయలేదనే భావన నాకెప్పుడూ కలగలేదు. సినిమా పరిశ్రమకొచ్చి 24 ఏళ్లయిందన్న విషయం కూడా నాకు గుర్తు లేదు. అద్భుతమైన విజయాలు సాధించిన దిల్రాజుతో సినిమా చేయడం, శ్రీరామ్ వేణు లాంటి ఒక మంచి దర్శకుడి దగ్గర నటించడం అదృష్టంగా భావిస్తున్నా. నేను నటుడినే కావాలనుకోలేదు. ఎవ్వరూ గుర్తుంచకుండా దిగువ మధ్య తరగతి జీవితం గడపాలనుకున్నా అది తప్ప అన్నీ తారాయి` అన్నారు పవన్కల్యాణ్.