సంక్రాంతి సినిమాల హడావిడి గత రెండు నెలలుగా నడుస్తూనే ఉంది. ముఖ్యంగా అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాల అప్డేట్స్ విషయంలో అయితే కొంత గందరగోళం కూడా నెలకొంది. మొదట ఈ రెండు చిత్రాల రిలీజ్ డేట్స్ ఒకేరోజు రావడం, తర్వాత ఒకరు ముందుకు రావాలని కోరడం, ఆ విధంగా జరిగిందంటూ నిర్మాతల గిల్డ్ కూడా స్పందించడం తెల్సిందే. అయితే మొదట అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు రెండూ జనవరి 12నే విడుదలకు మొగ్గు చూపినా, తర్వాత సరిలేరు నీకెవ్వరు ఒకరోజు ముందుకు వచ్చి జనవరి 11న విడుదలకు సిద్ధమైంది. న్యూస్ అయితే వచ్చింది కానీ ఈ చిత్రం ఒకరోజు ముందుకు జరిగినట్లు ఎక్కడా అధికారికంగా వెల్లడి కాలేదు. దాంతో అందరికీ కొత్త అనుమానాలు మొదలయ్యాయి. పేరుకే జనవరి 11 అని అన్నా ఎక్కడా అధికారికంగా టీమ్ ప్రకటించకపోయేసరికి ఆ న్యూస్ అబద్ధమేమో అనుకున్నారు.
అయితే నిన్న సరిలేరు నీకెవ్వరుకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి అప్డేట్ ఇచ్చారు నిర్మాతలు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న ఎల్బీ గ్రౌండ్స్ లో జరగనుంది. భరత్ అనే నేను చిత్రానికి కూడా అదే వేదికను ఎంచుకున్నారు. సో సెంటిమెంట్ గా మళ్ళీ అదే వేదికను కన్ఫర్మ్ చేసారు. ఇక ఆ పోస్టర్ లో సరిలేరు రిలీజ్ డేట్ జనవరి 11న అని కన్ఫర్మ్ చేసారు. దీంతో ట్రేడ్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, జనవరి 12న అల వైకుంఠపురములో చిత్రాలు ఒకరోజు గ్యాప్ లో విడుదల కన్ఫర్మ్ అయినట్లే. నిజానికి ఈ రెండు చిత్రాలకు కూడా జనవరి 10న శుక్రవారం డేట్ కు స్కోప్ ఉంది. అయితే జనవరి 10న ఈ రెండు చిత్రాలకు సంబంధించిన వారికి బ్యాడ్ సెంటిమెంట్ ఉంది.
జనవరి 10న మహేష్ బాబుకి 1 నేనొక్కడినే రిలీజయింది. అలాగే జనవరి 10న హారిక అండ్ హాసిని వాళ్లకు అజ్ఞాతవాసి రిలీజయింది. ఇక జనవరి 11న మహేష్ బాబుకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదలైంది. అలాగే జనవరి 12న అల్లు అర్జున్ కు దేశముదురు విడుదలైంది. ఈ నేపథ్యంలో గుడ్ సెంటిమెంట్ ను ఫాలో అవ్వడానికి ఇరు వర్గాలు ఓటు వేసాయి. చూడాలి మరి సంక్రాంతికి ఏం జరుగుతుందో.