బిగ్ స్క్రీన్లో హిట్టయిన సినిమా స్మాల్ స్క్రీన్లో ఫట్టయి షాకిచ్చింది. అదే యంగ్ హీరో నితిన్ మూవీ `భీష్మ`. వరుస మూడు ఫ్లాపుల తరువాత నితిన్కి `భీష్మ`తో భారీ విజయం లభించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కించాడు. ఈ ఏడాది లాక్డౌన్కి నెల ముందు ఈ మూవీ విడుదలైంది.
మంచి టాక్ని సొంతం చేసుకుని సూపర్ హిట్ ఫిల్మ్ అనిపించుకుంది. కానీ టెలివిజన్లో మాత్రం ఫ్లాప్ టాక్ని తెచ్చుకోవడం మేకర్స్ని షాక్ కు గురిచేసింది. అక్టోబర్ 25న `భీష్మ` చిత్రాన్ని జెమినీ టెలివిజన్ టెలికాస్ట్ చేసింది. 10 టీఆర్పీ రేటింగ్ రావాల్సిన ఈ చిత్రానికి 6.65 రేటింగ్ మాత్రమే రావడం జెమినీ టెలివిజన్తో పాటు `భీష్మ` మేకర్స్కి షాకిచ్చింది.
ఇటీవల ప్రభాస్ నటించిన `సాహో` చిత్రానికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఈ చిత్రానికి 6 లోపు టీఆర్పీ రేటింగ్ రావడం గమనార్హం. దీంతో ఇండస్ట్రీ వర్గాల్లో మదనం మొదలైంది. ఓటీటీ మార్కెట్ కారణంగా డిజిటల్ శాటిలైట్ రైట్స్ దెబ్బతినే అవకాశం వుందని భావిస్తున్నారు. దీని వల్లే టీఆర్పీ రేటింగ్ పడిపోయిందని వాపోతున్నారు.