ప్రపంచాన్ని కరోనా కాటేస్తుంటే టాలీవుడ్, కోలీవుడ్లో మాత్రం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లంటే ఆమడదూరం పారిపోయిన వారంతా ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే కొంత మంది పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమజంట పెళ్లికి రెడీ అయిపోతోంది. కెరీర్ తొలి నాళ్లలో శింబుతో ప్రేమాయణాన్ని సాగించిన నయనతార ఆ తరువాత ప్రభుదేవాతో ప్రేమలోపడి పెళ్లి వరకు వెళ్లిన విషయం తెలిసిందే.
ప్రభుదేవా కొన్ని కారణాల వల్ల నయనతారతో విడిపోవడంతో 2015 నుంచి యవ దర్శకుడు విగ్నేష్ శివన్తో ప్రేమలో మునిగితేలుతోంది. గత కొంత కాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవార్డ్స్ ఫంక్షన్ జరిగినా జంటగా ప్రత్యక్ష్యం కావడమే కాకుండా కొన్ని అవార్డు వేడుకల్లో అవార్డుని విగ్నేష్ శివన్ చేతుల మీదుగానే తీసుకుంటానని నయనతార పట్టుబట్టి ఆశ్చర్యపరిచింది.
గత కొన్ని నెలలుగా నయనతార, విగ్నేష్ శివన్ వివాహం చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్లో వరుస కథనాలు వినిపిస్తున్నాయి. లాక్డౌన్ సమయంలోనే వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారట. అత్యంత సన్నిహితులు పాల్గొనగా టెంపుల్లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోబోతున్నట్టు తాజాగా వినిపిస్తోంది. ఆ తరువాత చర్చిలో క్రిస్టియన్ పద్దతిలో వివాహం చేసుకుంటారని కోలీవుడ్ టాక్.