ప్రస్తుతం చాలా మంది టాలీవుడ్ హీరోలు ప్యాన్ ఇండియా కలలు అంటున్నారు. వారిలో ఎక్కువ మంది టాప్ హీరోలే కాగా సీనియర్ హీరోలు అందుకు దూరంగా ఉంటున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ మాత్రం ప్యాన్ ఇండియా ప్రయత్నం చేస్తానంటున్నాడు. గత సంవత్సరం మూడు చిత్రాలతో కంగుతిన్నాడు బాలయ్య. అందుకే ఈసారి భారీ హిట్ తో మన ముందుకు రావాలని కసిగా ఉన్నాడు. అందుకే తనకు అచ్చొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమా పూర్తయ్యాక బాలయ్య తదుపరి సినిమా ఏమిటా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. వరసగా సినిమాలు చేసేందుకు ఇష్టపడే బాలకృష్ణ కోసం పూరి జగన్నాథ్, బి గోపాల్ వంటి దర్శకులు లైన్లో ఉన్నారు. అలాగే బాలకృష్ణ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఆదిత్య 369 సీక్వెల్ మరోసారి ఇప్పుడు తెరపైకి వచ్చింది.
సింగీతం శ్రీనివాసరావు గత కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా స్క్రిప్ట్ పై పనిచేస్తున్నాడు. నాలుగైదేళ్లుగా ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 గా తెరకెక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్క్రిప్ట్ పనులు ఓ కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతోనే బాలయ్య ప్యాన్ ఇండియా ప్రయత్నం చేయబోతున్నాడట. ఏదేమైనా ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వేచి ఉండక తప్పదు.