తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ శుక్రవారం అపోలో ఆసుపత్రిలో చేరడం పలువురిని ఆందోళనకు గురిచేసింది. రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారని, ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆసుపత్రి వర్గాలు శుక్రవారం హెల్త్ బులిటెన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ విషయం తెలుసుకున్న హీరో మోహన్బాబు షాక్కు గురయ్యారట.
కలెక్షన్కింగ్ మోహన్బాబు, సూపర్స్టార్ రజనీకాంత్ ల మధ్య మంచి స్నేహ బంధం వుంది. చిరకాల మిత్రుడు అకస్మాత్తుగా హాస్పిటల్లో చేరడంతో మోహన్బాబు వెంటనే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారట. రజనీకాంత్కు తోడుగా ఆయన కుమార్తె హాస్పటల్లోనే వుండటంతో ఆమెతో మాట్లాడి ప్రాణ స్నేహితుడి ఆరోగ్య వివరాలు మోహన్బాబు తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారట.
రజనీ మానసికంగా, శారీరకంగా దృఢమైన వ్యక్తి అని, ఈ అస్వస్థత నుంచి ఆయన త్వరగా కోలుకుని ఎప్పటిలాగే తన పనులు మొదలుపెడతారని మోహన్బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రజనీకాంత్ తమిళ చిత్రం `అన్నాత్తే` షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల చిత్రీకరణ తరువాత యూనిట్ సభ్యుల్లో కొంత మందికి కరోనా సోకినట్టు తెలియడంతో రజనీ వెంటనే స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయారు.