కరోనా కారణంగా థియేటర్లు మూసేయడంతో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు వినోద మాధ్యమం ఓటీటీ ప్లాట్ ఫామ్. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఇప్పుడు ఓటీటీనే నమ్ముకుంటున్నాయి. ఓటీటీలకు డిమాండ్ ఏర్పడటంతో యంగ్ డైరెక్టర్లు నుంచి స్టార్ డైరెక్టర్ల వరకు ఓటీటీ బాట పడుతున్నారు. తాజాగా యంగ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓటీటీ బాటపడుతున్నారు. ` వెంకటాద్రి ఎక్స్ప్రెస్`, ఎక్స్ప్రెస్ రాజా వంటి చిత్రాలతో వరుస హిట్లని సొంతం చేసుకున్న గాంధీ `కృష్ణార్జున యుద్ధం`తో కాస్త వెనకబడ్డారు.
ప్రస్తుతం నితిన్ హీరోగా బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `అంధాదున్` రీమేక్ పనుల్లో బిజీగా వున్న మేర్లపాక గాంధీ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం ఓ కథని సిద్ధం చేసినట్టు తెలిసింది. అయితే ఈ కథని ఆయన డైరెక్ట్ చేయడం లేదట. అతని వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ఓ అసోసియేట్ డైరెక్ట్ చేస్తాడని తెలిసింది. ఓటీటీకి తగ్గట్టే మేర్లపాక రాసిన అడల్ట్ కామెడీ స్క్రిప్ట్తో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురానున్నారట.
యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలిసింది. ఇందులోని ప్రధాన పాత్రల్లో దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్, బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు నటించనున్నారని ఇన్ సైడ్ టాక్. అల్లు అరవింద్కు సంబంధించిన ఓటీటీ ప్లాట్ ఫామ్ `ఆహా` కోసం ఈ అడల్ట్ కామెడీని రూపొందిస్తున్నారట. ఇప్పటికే ఈ మూవీ కోసం విశాఖ తీరంలో వున్న ఓ రిసార్ట్ని షూటింగ్ కోసం తీసుకున్నారట.