కరోనా వైరస్ సినీ రంగాన్ని కుదిపేస్తోంది. గత మూడున్నర నెలలుగా ఎలాంటి రిలీజ్లు, షూటింగ్ లు లేకపోవడంతో అన్ని ఇండస్ట్రీలు కుదేలైపోతున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ రానున్న చిత్రాలకు స్టార్స్ పారితోషికాలు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. దీన్ని తమిళ స్టార్ హీరోలు ఆచరించి ముందు వరుసలో నిలుస్తున్నారు. తెలుగు స్టార్స్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ తమిళ హీరోలు మాత్రం పారితోషికం తగ్గించుకోవడానికి తాము సిద్ధమంటూ సంకేతాలిస్తున్నారు.
ఇటీవల విజయ్ సేతుపతి తన పారితోషికంలో కొంత తగ్గించుకుంటున్నానని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ కూడా తన పారితోషికం తగ్గించుకుంటున్నట్టు ప్రకటించారని తెలిసింది. విజయ్ ఒక్కో చిత్రానికి 80 కోట్లు తీసుకుంటున్నారు. ఇండియాలో అత్యంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నా టాప్ స్టార్స్లో విజయ్ ఒకరు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తన పారితోషికాన్ని 20 కోట్లు తగ్గించుకుంటున్నట్టు విజయ్ ప్రకటించారట. అంటే తాజా చిత్రానికి 60 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారన్నమాట.
`మాస్టర్` చిత్రం తరువాత విజయ్ `తుపాకి` సీక్వెల్ ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సన్ పిక్చర్స్ ప్రకటించింది. ఏ.ఆర్ . మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తన పారితోషికం కూడా భారీ గానే తగ్గించుకున్నారట. హీరో విజయ్ ఈ ప్రాజెక్ట్ కోసం 20 శాతం రెమ్యునరేషన్ తగ్గించుకోవడం చర్చనీయాంశంగా మారింది.