జూన్ 7న యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, కన్నడ హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో చిరంజీవి సర్జా కుటుంబంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ఈ విషాదం నుంచి ఈ కుటుంబం తేరుకోకుండానే మరో పిడుగులాంటి వార్త ఆ ఇంటిని షాక్కు గురిచేస్తోంది. చిరంజీవి సర్జా సోదరుడు ధృవ సర్జాకూడా కన్నడలో హీరోగా రాణిస్తున్నారు. ఆయన, ఆయన భార్య ప్రేరణ శంకర్ కరోనా బారిన పడటం వారి అభిమానుల్ని, కుటంబ సభ్యుల్ని భయాందోళనకు గురిచేస్తోంది.
తనకు, తన భార్యకు కరోనా సోకిందని హీరో ధృవ సర్జా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నామని, టెస్టుల్లో తమకు పాజిటివ్ వచ్చిందని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు ధృవ సర్జా. బెంగళూరులోని ఆసుపత్రిలో చేరాలని నిర్ణయించుకున్నామని, తాము త్వరలోనే కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తామని ధృవ సర్జా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గత కొద్ది రోజులుగా ఎవరైతే తమని కలిశారో వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం` అన్నారు. ధృవ సర్జా నటించిన `పొగరు` చిత్రం విడుదల కావాల్సి వుంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని నందకిషోర్ తెరకెక్కించారు.