మెగాప్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. లాక్డౌన్ కారణంగా గత ఎనిమిది నెలలుగా ఆగిపోయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని కోకాపేట్లో ఈ మూవీకి సంబంధించిన ఓ పాటని చిరంజీవి, కాజల్ అగర్వాల్లపై కొరటాల శివ చిత్రీకరిస్తున్నారు.
ఇదిలా వుంటే మలయాళ బ్లాక్ బస్టర్ `లూసీఫర్` తెలుగు రీమేక్లో చిరంజీవి నటించనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనని మెగాస్టార్ చిరంజీవి బుదవారం సాయంత్రం చేశారు. చిరు నటించనున్న 153వ చిత్రమిది. వచ్చే ఏడాది సంక్రాంతి తరువాత ఈ మూవీ సెట్స్ పైకి రానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ ` `లూసీఫర్` రీమేక్ స్క్రిప్ట్ ఫైనల్ అయింది. `తని ఒరువన్` ఫేమ్ మోహన్రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. మన నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ని మోహన్రాజా చాలా బాగా నెరేట్ చేశాడు. సంక్రాంతి తరువాత సెట్స్కి వెళతాం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో జరిగే షూటింగ్ తో మొత్తం చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్గారు నిర్మిస్తారు` అన్నారు.
దర్శకుడు మోహన్రాజా మాట్లాడుతూ `మెగాస్టార్ చిరంజీవి నటించిన `హిట్లర్` చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాను. ఇప్పుడు ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతం. నిర్మాత ఎన్వీ ప్రసాద్గారు రాజీపడకుండా నిర్మించనున్నారు` అని తెలిపారు. `చిరంజీవితో పాటు మా అందరికి నచ్చేలా మార్పులు చేర్పులతో మోహన్ రాజా అద్భుతంగా మలిచారు. బాస్తో సినిమా అంటేనే కొత్త ఉత్సాహం నెలకొంది. భారీ బడ్జెట్తో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తాం` అని ఎన్వీ ప్రసాద్ తెలిపారు.