ఇటీవల తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని చిరంజవి స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ వార్త విన్న ఫ్యాన్స్ భయాందోళనకు గురవుతున్నారు. చిరు క్షమంగా వుండాలని ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. ఇదిలా వుంటే చిరు శుభవార్త చెప్పారు. తాజాగా చేసిన టెస్టుల్లో తనకు నెగెటివ్ వచ్చిందని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గత ఐదు రోజుల క్రితం అంటే సోమవారం చిరుకు కరోనా సోకిందంటూ తేలినా ఆయనలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి వైద్యులను సంప్రదించారు.
తాజాగా చేసిన ఆర్టీ పీసీఆర్ పరీక్షలో చిరుకు కరోనా లేదని తేలింది. ఈ శుభవార్త విన్న చిరు తను కోలుకోవాలని ప్రార్థించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కరోనా పాజిటివ్ నుంచి నెగెటివ్ వచ్చిన క్రమాన్ని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. `కాలం, కరోనా గత నాలుగు రోజులుగా నన్ను కఫ్యూజ్ చేసి ఆడేసుకున్నాయి. ఆదివారం చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. అప్పటి నుంచి బేసిక్ మెడికేషన్ ప్రారంభించాను` అన్నారు.
రెండు రోజులైనా ఎలాంటి లక్షణాలు కనిపించకపోయేసరికి అనుమానం వచ్చింది. దీంతో అపోలో డాక్టర్లని సంప్రదించాను. వాళ్లు సీటీ స్కాన్ చేసి చెస్ట్లో ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తేల్చిచెప్పారు. అక్కడ నెగెటివ్ వచ్చిన తరువాత కూడా మూడు రకాల కిట్లతో పరీక్షలు చేయించుకున్నాను. ఆఖరికి నాకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చిన చోట కూడా టెస్ట్ చేయించుకున్నాను. అక్కడా నెగెటివ్ అని వచ్చింది. మొదటి చేసిన కిట్ లో లోపాల కారణంగానే తప్పిదం జరిగినట్టు డాక్టర్లు గుర్తించారు. ఈ సమయంలో నాపై మీరంతా చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు` అని తెలిపారు చిరు.