మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ విభిన్న మైన చిత్రాలకు కేరాష్ అడ్రస్గా మారుతోంది. గగనం, ఘాజీ, క్షణం వంటి వినూత్న చిత్రాలని అందించిన ఈ సంస్థ తాజాగా మరో విలక్షణమైన చిత్రాన్ని ప్రకటించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా `ఆచార్య` చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సంస్థ తాజాగా యంగ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ ఎస్ జేతో ఓ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించింది.
యంగ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ ఎస్ జే `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్యేయ` చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మంచి మార్కులు సాధించాడు. తొలి సినిమాతో పరిశ్రమ వర్గాల దృష్టిని ఆకర్షించాడు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో మ్యాటీని ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. తిరుపతి సమీపంలోని బౌంటీ హంటింగ్ సెట్ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని తెలుస్తోంది.
మంగళవారం ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర బృందం ఓ ఆసక్తికరమైన పోస్టర్ని రిలీజ్ చేసింది. పిట్టగోడ.. ఆ గోడపై కోడి పుంజు.. 50 లక్షలు నజరానా ప్రకటిస్తూ వాంటెడ్ పోస్టర్.. సినిమా ఆసక్తికరంగా వుంటుందనే సంకేతాల్ని అందిస్తోంది.