ఇటీవలే జరిగిన అలయ్ బలయ్ ఈవెంట్ లో జనసేనాని పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు ఒకే వేదికపై కలిసిన విషయం తెల్సిందే. ఇద్దరూ ఒక స్టేజ్ పై ఉన్నా కూడా ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు కానీ స్టేజ్ మీద ఒకరినొకరు చూసుకోలేదు కూడా. మీడియాలో కూడా మంచు విష్ణు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకోలేదని వార్తలు వచ్చాయి.
రీసెంట్ గా మంచు విష్ణు శ్రీ విద్యానికేతన్ ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఈ వార్తలపై స్పందించాడు. పవన్ కళ్యాణ్, నేను మాట్లాడుకున్నాం. ఇద్దరం ఎడమొహం, పెడమొహంగా ఉన్నారన్న వార్తల్లో అసలు నిజం లేదు. మేము బాగానే ఉన్నాం. మంచు, మెగా ఫ్యామిలీల మధ్య దూరమేం లేదు అని వ్యాఖ్యానించాడు.
సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలన్న ప్రకాష్ రాజ్ డిమాండ్ పై కూడా మాట్లాడాడు. ఎన్నికల్లో గెలుపోటములు చాలా సహజం. కావాలంటే ప్రకాష్ రాజ్ చక్కగా చెక్ చేసుకోవచ్చు అని స్పందించాడు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామాపై స్పందించిన మంచు విష్ణు, వాళ్ళ రాజీనామా పత్రాలు నాకు ఇంకా అందలేదు. అందితే అప్పుడు దాని గురించి మాట్లాడగలను అని మంచు విష్ణు తెలిపాడు.