గత ఏడాది `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్న సూపర్స్టార్ మహేష్బాబు నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. యంగ్ డైరెక్టర్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
బ్యాకింగ్ వ్యవస్థపై సెటైరికల్ గా ఈ మూవీని చేస్తున్నారు. ఓ వైట్ కాలర్ నేరగాడి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ ఇటీవల దుబాయ్లో మొదలైన విషయం తెలిసిందే. అక్కడి సుందరమైన లొకేషన్లలో కీలక సన్నివేశాలతో పాటు కొన్ని పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా మునుపెన్నడూ లేని విధంగా మహేష్ దుబాయ్ లొకేషన్లకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకున్నారు.
ఇటీవలే చిత్ర బృందం దుబాయ్ షెడ్యూల్ని పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వచ్చింది. మరో షెడ్యూల్ కోసం మహేష్ టీమ్ మరోసారి దుబాయ్ వెళుతున్నట్టు తెలిసింది. ఆ తరువాత గోవాలోనూ ఓ భారీ షెడ్యూల్ చేయనున్నారట. ఈ చిత్రానికి సంగీతం తమన్, ఛాయాగ్రహణం మది, కళ ఏ ఎస్ ప్రకాష్, ఎడిటింగ్ మార్తిండ్ కె. వెంకటేష్.