మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదలై సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ చిత్రం ఏ లెవెల్ లో చిత్రీకరణ జరుపుకుందో చూచాయిగా చూపించింది. అన్ని వర్గాల నుండి ఈ టీజర్ మంచి స్పందన లభించింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ చిత్ర టీజర్ ను పొగిడేసాడు.
నిన్న జరిగిన సినీ మహోత్సవం కార్యక్రమానికి చిరంజీవి, మహేష్ ఇద్దరూ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ స్పందిస్తూ “చిరంజీవి సర్ పక్కన కూర్చుని ఆయనతో మాట్లాడడమే కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. సైరా టీజర్ చూసాను. అత్యద్భుతంగా ఉంది. సినిమా చూడాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. సైరా టీమ్ కు నా బెస్ట్ విషెస్” అని అన్నారు. మహేష్ చిరు గురించి, సైరా గురించి ఇంత పాజిటివ్ గా మాట్లాడడంతో ఇరు వర్గాల అభిమానులు సంతోషంగా ఉన్నారు.