ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో మధ్య కాంపిటీషన్ గురించే ప్రధానంగా ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరూ ఒక్కరోజు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతుండడంతో సందడి మాములుగా లేదు. వీరిద్దరి పోటీ ఈ రేంజ్ లో ఉంటే మరి అల్లు వారి మహేష్ సినిమా అంటారేంటి అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. మరి ఇదేంటి అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే మరి.
అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ సంస్థ నుండి చాలానే హిట్ సినిమాలు వచ్చాయి. ఈ సంస్థ ఎక్కువగా ఎవరితో సినిమాలు చేస్తుందో అందరికీ తెలిసిందే. మెగా హీరోలతో ఎక్కువగా సినిమాలు నిర్మించే ఈ సంస్థ యువ హీరోలతో కూడా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. కానీ టాప్ హీరోలైన ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ వంటి హీరోలతో సినిమాలు ఇంతవరకూ నిర్మించలేదు. దీనికి కారణాలు ఏవైనా కావొచ్చు కానీ సినిమాలు మాత్రం నిర్మించలేదు అన్నది నిజం.
ప్రస్తుతం అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో నిర్మాణ పర్యవేక్షకుడిగానే ఉంటున్నాడు. ఎప్పటినుండో అల్లు ఫ్యామిలీకి దగ్గరగా వ్యవహరిస్తోన్న బన్నీ వాసు, ఇప్పుడు గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2 లో సినిమాలకు నిర్మాతగా ఉంటున్నాడు. రేపు విడుదల కానున్న ప్రతిరోజూ పండగే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ వాసు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా బయట హీరోలతో సినిమాలు నిర్మించే విషయమై టాపిక్ రాగా, మహేష్ బాబు హీరోగా గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా తెరకెక్కనుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత దాని గురించి న్యూస్ అన్నదే లేదు.
బన్నీ వాసు మాట్లాడుతూ.. మహేష్ తో సినిమా నిర్మించాలని ప్లాన్ చేసాం, కానీ కుదర్లేదు. వచ్చే ఏడాది కచ్చితంగా దీనికి సంబంధించిన అధికారిక వార్త వస్తుందని తెలిపాడు. దీనిబట్టి అల్లు వారు మహేష్ తో సినిమా విషయాన్ని చాలా సీరియస్ గా కన్సిడర్ చేస్తున్నట్లు తేలిపోయింది. ఇక దర్శకులకు అడ్వాన్స్ లు ఇచ్చి తమ దగ్గర లాక్ చేసుకుంటారు అన్న విషయంపై కూడా మాట్లాడుతూ దర్శకులకు అడ్వాన్స్ కు ఇచ్చినా కానీ మా దగ్గరే చేయాలని లాక్ చేయం. వేరే చోట అవకాశమొస్తే కచ్చితంగా వెళ్లి చేసుకోవచ్చు. పరశురామ్ కు మా దగ్గర కమిట్మెంట్ ఉంది. అయినా కానీ 14 రీల్స్ ప్లస్ లో అవకాశం వచ్చింది. దానికి మేమేం కాదనలేదు అని సమాధానమిచ్చాడు బన్నీ వాసు.