లాక్డౌన్ కారణంగా వినోదానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచింది డిజిటల్ మీడియా. థియేటర్లు మూసివేయడంతో ఓటీటీలకు క్రేజ్ పెరిగిపోయింది. దీంతో చాల మంది ఓటీటీవైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు. ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు కొరటాల శివ. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో `ఆచార్య` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన త్వరలో యంగ్ హీరోతో వెబ్ సిరీస్ కు రెడీ అవుతున్నారట.
ఇందు కోసం డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. తన శిష్యుడిని ఈ వెబ్ సిరీస్ ద్వారా దర్శకుడిగా పరిచయం చేయబోతున్నారు. ఈ వెబ్ సిరీస్లో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నటించబోతున్నాడని తెలిసింది. `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్` చిత్రంలో నెగెటివ్ పాత్రలో కనిపించిన నవీన్ పొలిశెట్టి `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం రాహుల్ రామకృష్ణతో కలిసి `జాతి రత్నాలు` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ తరువాత నవీన్ పొలిశెట్టి నటించనున్నతొలి వెబ్సిరీస్ ఇదే కాబోతోంది. గత కొన్ని నెలలుగా తను కథల్ని అందిస్తూ తన వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన వారిని దర్శకులుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదే తరహాలో కొరటాల శివ తన శిష్యుడిని తాజా వెబ్ సిరీస్తో దర్శకుడిగా పరిచయం చేస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.