
కింగ్ నాగార్జున నటించిన యాక్షన్ థ్రిల్లర్ `వైల్డ్ డాగ్` థియేటర్లలో ఈ నెల 2 న విడుదలైంది. అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిరంజన్రెడ్డి, అన్వేష్రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. దురదృష్టవశాత్తు ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ తరువాత కోవిడ్ -19 సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా ప్రమాదకర పరిస్థితికి చేరింది.
దీంతో ఈ మూవీ కోసం థియేటర్లకి రావాలనుకున్న వారు కూడా రాలేకపోయారు. దీంతో మేకర్స్ కొన్ని రోజుల క్రితం `వైల్డ్ డాగ్`ను అతిపెద్ద స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్కు డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఇచ్చేశారు. ఈ నెల 22న ఈ మూవీ స్ట్రీమింగ్ నెట్ ఫ్లిక్స్లో మొదలైంది. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం తెలుగు, తమిళం, మలయాళంతో పాటు కన్నడ భాషలలో ప్రసారం అవుతోంది.
`వైల్డ్ డాగ్` తెలుగు వెర్షన్ మాత్రం ఇండియాలో అగ్రస్థానంలో ట్రెండింగ్ అవుతుండగా, తమిళ వెర్షన్ ఐదవ స్థానంలో ట్రెండ్ అవుతోంది. 2007 లో జరిగిన గోకుల్ చాట్ బాంబు పేలుడుతో సహా భారతదేశంలో జరిగిన అనేక ఉగ్రవాద సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్లలో ఆకట్టుకోలేకపోయినా ఓటీటీలో రికార్డు స్థాయి వ్యూస్ని రాబడుతుండటంతో నాగ్ హ్యాపీగా ఫీలవుతున్నారట.