`బాహుబలి` చిత్రంతో భారతీయ సినిమా స్వరూపమే ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా తరువాత ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్థాయి చిత్రాల హీరో అయిపోయారు. దీంతో ఆయనతో ఎవరు సినిమా ప్లాన్ చేసినా అది పాన్ ఇండియా స్థాయిలోనే వుంటోంది. తాజాగా `రాధేశ్యామ్` చిత్రాన్ని చేస్తున్న ప్రభాస్ వరుసగా రెండు భారీ చిత్రాన్ని అంగీకరించి షాకుల మీద షాకులిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ని అంగీకరించిన ప్రభాస్ తాజాగా బాలీవుడ్ దర్శకుడిలో `ఆది పురుష్` చిత్రాన్ని ప్రకటించి భారీ సర్ప్రైజ్ ఇచ్చారు.
ఇది ప్రభాస్ నటించనున్న 22వ చిత్రం. ఈ చిత్రాన్ని టీసిరీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. రామాయణ గాధని టచ్ చేస్తూ అధునిక పంథాలో ఈ చిత్రాన్ని సరికొత్త నేపథ్యంలో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ టైటిల్ మోషన్ పోస్టర్తో ఈ సినిమా నేపథ్యంలో ఏంటి? .. ఎవరి పాత్ర ఎలా వుండబోతోందన్నది స్పష్టమైంది. శ్రీరాముడిగా ప్రభాస్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్గా రావణాసురుడిగా కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ కథకు కీలకమైన సీత పాత్రలో `మహానటి`తో విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకున్న కీర్తి సురేష్ని అనుకుంటున్నారట. ఈ పాత్రకు కీర్తి అయితేనే న్యాయం చేస్తుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారని, ఈ పాత్ర కోసం ఆమెతో సంప్రదింపులు జరపాలని చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. కీర్తి సురేష్ ప్రస్తుతం వరుసగా నాటుగు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. ఓకే చెబుతుందా అన్నది ఇప్పుడు మేకర్స్ ముందున్న సమస్య. ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభించి 2022కి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.