`బాహుబలి`తో రాజమౌళి పాన్ ఇండియా స్థాయి డైరెక్టర్ల జాబితాలో ముందు వరుసలో నిలిచారు. ఆయన నుంచి సినిమా వస్తోందంటే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అంతలా ఆయన పాపులారిటీ పెరిగిపోయింది. ఇదిలా వుంటే ఆయన తెరకెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` నిత్యం వార్తల్లో నిలుస్తోంది. రామ్చరణ్, ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ కావడంతో ఈ చిత్రంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఈ సినిమాకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటికి వచ్చినా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతోంది. ఇందులో బాలీవుడ్ భామ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్చరణ్కు జోడీగా సీత పాత్రలో అలియా నటిస్తోంది. ఇటీవలే తనకు సంబంధించిన షూటింగ్ని పూర్తి చేసి బ్రేక్ తీసుకున్న అలియా భట్ మళ్లీ ఈ మూవీ సెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం అలియాభట్ క్యారెక్టర్ని ముందు అనుకున్నదానికి మించి పెంచేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అలియా టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఆమెని ఈ సినిమా కోసం మరికొన్ని సీన్లలో వాడాలని రాజమౌళి భావిస్తున్నారట. దీంతో ఆమె పాత్ర నిడివి కూడా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. త్వరలోనే అలియా హైదరాబాద్ రానుంది. వచ్చిన వెంటనే ఆమెపై రామ్చరణ్ పాల్గొనగా ఓ పాటని షూట్ చేస్తారట. అలాగే కొన్ని కీలక సన్నివేశాలని అలియాపై చిత్రీకరించాలని జక్కన్న ప్లాన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.