
టీడీపీ నేతలకు సవాల్ విసిరారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. తాము అధికారంలోకి వస్తే వైఎస్సార్ విగ్రహాలన్నింటినీ బంగాళాఖాతంలో పడేస్తామంటున్న టీడీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే మహానేత విగ్రహాన్ని తాకి చూడాలని సవాల్ చేశారు. ప్రజలు 2019లోనే టీడీపీని బంగాళాఖాతంలోకి విసిరేశారని వ్యాఖ్యానించారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి.. ఆ పార్టీ నాయకులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు తదితరులతో కలసి కన్నబాబు సోమవారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉండగా విజయవాడలో కుట్రపూరితంగా కంట్రోల్ రూమ్ సెంటర్లో వైఎస్సార్ విగ్రహాన్ని క్రేన్లతో తొలగించడంతో మీ బతుకు 23 సీట్లకే పరిమితమైందని, మేం అధికారంలోకి వచ్చాక అక్కడ అద్భుతమైన విగ్రహాన్ని ఆవిష్కరించామని అన్నారు.
వైఎస్సార్ అంటే వ్యక్తి కాదు.. ఈ రాష్ట్రంలో ఒక శక్తి. వైఎస్సార్ పుణ్యమాని ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం పొందామని, పిల్లల్ని ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదివించగలిగామని ఇవాళ్టికీ ప్రజలు గడప గడపకూ కార్యక్రమంలో చెబుతున్నారు. చంద్రబాబు పాలనలో పేదలకు ఏం ఒరిగిందో ఒక్కటైనా చెప్పుకునే దమ్ము ఉందా? సాక్షాత్తూ ఎన్టీఆర్నే పార్టీ నుంచి తొలగించిన ఘనత మీదంటూ ఎద్దేవా చేశారు కన్నబాబు.