`బాహుబలి`తో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఇప్పడు ప్రభాస్ పాన్ ఇండియా హీరో. ఆయనతో వందల కోట్ల బడ్జెట్తో సినిమాలు తీయడానికి బడా నిర్మాతలు క్యూ కడుతున్నారు. టాలీవుడ్ నిర్మాతలే కాకుండా బాలీవుడ్ నిర్మాతలు కూడా ఆయన డేట్స్ ఇస్తే చాలాని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొంత మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ మరి కొంత మంది బాలీవుడ్ నిర్మాతల్ని హోల్డ్లో పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
`సాహో` ఫలితంతో మనసు మార్చుకున్న ప్రభాస్ ది బెస్ట్ డైరెక్టర్లతో మాత్రమే సినిమాలు చేయాలనే ఆలోచనకు వచ్చేశారు. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న పిరియాడిక్ లవ్స్టోరీ `రాధేశ్యామ్` లో నటిస్తున్న ప్రభాస్ ఆ వెంటనే టాలెంటెడ్ డైరెక్టర్తో సినిమా అంగీకరించాడు. `మహానటి` చిత్రంతో విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కురిపించిన నాగ్ అశ్విన్తో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఈ ఏడాది చివరలో ప్రారంభం కాబోతోంది.
ఇదిలా వుంటే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్తో `ఆది పురుష్` చిత్రాన్ని ప్రకటించి షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని టి సిరీస్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. రామాయణ గాధ నేపథ్యంలో సరికొత్త పంథాలో ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్ పైకి రాబోతోంది. దీనితో పాటు ఆదిత్యా చోప్రా ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ని ప్రభాస్ ప్రస్తుతం హోల్డ్లో పెట్టినట్టు తెలిసింది. దీనికి కూడా ప్రభాస్ ఓకే చెప్పేస్తే రానున్న మూడేళ్ల వరకు ప్రభాస్ డైరీ ఫుల్ అయిపోయినట్టే అంటున్నారు టాలీవుడ్ జనం.